ఐఫోన్‌ల తయారీ మార్కెట్‌గా భారత్

by Disha Web Desk 17 |
ఐఫోన్‌ల తయారీ మార్కెట్‌గా భారత్
X

న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ ప్రపంచ ఐఫోన్‌ల సరఫరాలో మేడ్-ఇన్-ఇండియా యూనిట్ల వాటా 5 శాతం నుంచి 7 శాతం వరకు ఉంటాయని ఓ నివేదిక తెలిపింది. దేశీయంగా యాపిల్ సంస్థ ఈ ఏడాది మొత్తం 1.1 కోట్ల నుంచి 1.2 కోట్ల యూనిట్ల ఐఫోన్‌లను తయారు చేయనుంది. గతేడాది భారత్‌లో 75 లక్షల యూనిట్ల ఐఫోన్‌లు తయారయ్యాయి.

ఇటీవల భారత్‌లో ఐఫోన్‌ల తయారీని చేపట్టే మూడు కంపెనీలు ఈ ఏడాది రికార్డు స్థాయిలో 85 శాతం స్థానిక డిమాండ్‌ను తీరుస్తాయని మార్కెట్ పరిశోధనా సంస్థలు పేర్కొన్నాయి. 2021లో మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్‌లు ప్రపంచ సరఫరాలో 3 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి. అంతకుముందు 2020లో ఇది 1.5 శాతం కంటే తక్కువగా ఉండేది.

ఇదే సమయంలో ప్రపంచ ఐఫోన్ డిమాండ్‌లో చైనాలో తయారైన యూనిట్ల వాటా క్రమంగా తగ్గుతోందని, 2020లో 98.2 శాతం నుంచి గతేడాదికి 95.8 శాతానికి తగ్గింది. ఈ ఏడాది మరింత క్షీణించి 93.5 శాతానికి చైనా వాటా పడిపోయే అవకాశాలున్నాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది.

కరోనా మహమ్మారితో పాటు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య యాపిల్‌తో పాటు ఇతర అమెరికా టెక్ కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నాయి. ఈ క్రమంలో వారికి భారత్ కీలక ఎంపికగా మారుతోందని పరిశోధనా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, యాపిల్ మరికొద్ది రోజుల్లో తన సరికొత్త ఐఫోన్ 14ను మార్కెట్లో విడుదల చేయనుంది.

Next Story

Most Viewed